కేసీఆర్ కు ఎందుకంత తొందర.! ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, రాజకీయ, సామాజిక విశ్లేషకులు 9640466464

 రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వంటి నాయకులను కలిసిన ఆయన.. ఇటీవల మహారాష్ట్ర వెళ్లి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ యాదవ్ ను కలిసి వచ్చారు. వచ్చీ రాగానే నారాయణఖేడ్ లో ఏర్పాటు చేసిన సభలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించేశారు. అయితే రాష్ట్రాన్ని ఎవరికి అప్పగిస్తారు? జాతీయ రాజకీయాల్లో ఏ కూటమితో జతకడతారు? జాతీయ పార్టీల మద్దతు లేకుండా థర్డ్ ఫ్రంట్ రూప కల్పన అసలు సాధ్యమేనా? కేవలం ప్రధాని పదవిపై ఆశతోనే చంద్రశేఖర్ రావు జాతీయ రాగం అందుకున్నారా? కేసీఆర్ రాష్ట్రాన్ని వీడితే టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగలుగుతుందా? ఇవి తెలంగాణ ప్రజానికంలోనే కాకుండా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలంటే చాలా అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.  రాష్ట్రానికి వారధి  ఎవరు.!

ఎవరి భుజాలపై విడిచి పెడుతారు కేసీఆర్ కు అంత ఎందుకు  తొందరపాటు ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.. మార్చి పదో తేదీన ఫలితాలు రాబోతున్నాయి.. వచ్చిన ఫలితాల ఆధారంగానే భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా యూపీలో వచ్చిన ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. టీఎంసీ విస్తరిస్తుండడంతో పలు రాష్ట్రాల్లో హస్తం మరింత కుదేలైంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సమయం వరకు మరింత వీక్ అయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలు క్రమంగా బలపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి.. ప్రస్తుతం మమతా బెనర్జీ తప్ప బీజేపీతో ఢీ అంటే ఢీ అనేలా ఏ ప్రాంతీయ పార్టీ అధినేత వ్యవహరించడం లేదు. ఇందుకోసమే జాతీయ రాజకీయాలకు ఇదే సరైన సమయమని కేసీఆర్ భావించినట్టున్నారు. థర్డ్ ఫ్రంట్ కు పూర్తిస్థాయిలో రూపకల్పన చేసి తానే లీడ్ చేసేలా ప్రణాళికలు రూపొందించే పనిలో పడినట్లు సమాచారం. మిగతా ప్రాంతీయ పార్టీల సహకారం ఎలా ఉన్నా.. మోడీకి తానే ప్రత్యామ్నాయమని దేశ ప్రజల్లో ఒక మెస్సేజ్ వెళ్లేలా కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ సహకారం లేకుండా ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటే.. ప్రధాని పదవి వరించకపోయినా.. కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశముంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. 


విమర్శలు.. ప్రతివిమర్శలు.. జాతీయ రాజకీయాలపై ప్రకటన చేయగానే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డాయి. ఇప్పటికే హస్తంతో దోస్తానా అని బీజేపీ, కాషాయంతో కలిసి ఉంటున్నాడని కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. అయితే ఇక్కడ రెండు పార్టీల ఆరోపణలను కూడా కొట్టిపారేయలేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలను కలుస్తూ, యూపీఎను బలహీనపర్చడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని వెనక మోడీ ఉన్నారని చెబుతున్నారు. కేసీఆర్ అడుగులు కూడా అలాగే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్, టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయని బీజేపీ చెబుతోంది. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించడం ఇందుకు నిదర్శనమని పేర్కొంటోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం... ప్రతిపక్షం తామే అని రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయనేది వాస్తవం. అయితే టీఆర్ఎస్ ఒంటరిగా ఉంటుందా.. ఏ పార్టీతోనైనా కలిసి వెళ్తుందా అంటే అది కేసీఆర్ చెబితేనే తెలిసేది. 


జాతీయ పార్టీల మద్దతు లేకుండా.. 

కాంగ్రెస్, బీజేపీల మద్దతు లేకుండా ఎవరూ ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయారని చరిత్ర చెబుతోంది. ఏదైనా పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్‌సభలో 543 స్థానాలకుగాను కనీసం 272 స్థానాలు ఉండాలి. అంటే కాంగ్రెస్, బీజేపీ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కష్టమనే చెప్పవచ్చు. గతాన్ని పరిశీలిస్తే ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే దానికి సైతం ఈ రెండు జాతీయ పార్టీలు బయటి నుంచి మద్దతు ఇచ్చాయి. 1989-91లో నేషనల్ ఫ్రంట్, 1996-98లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ హయాంలో నలుగురు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వీపీ సింగ్), చంద్ర శేఖర్, హెచ్‌డీ దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రులుగా వ్యవహరించారు. జనతాదళ్ నాయకుడు వీపీ సింగ్ ప్రధానమంత్రిగా 1989 డిసెంబరులో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు బీజేపీ, వామపక్షాలు వెలుపలి నుంచి మద్దతు అందించాయి. 1990లో వీపీ సింగ్ బలపరీక్షను ఎదుర్కొని ఓడిపోగా, జనతాదళ్ నాయకుడు చంద్ర శేఖర్ ఆ పార్టీ నుంచి వేరుపడి, సమాజ్‌వాదీ జనతా పార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో చంద్ర శేఖర్ పదవికి రాజీనామా చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ మద్దతుతో జనతాదళ్ నాయకుడు హెచ్‌డీ దేవెగౌడ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ లో విభేదాలు రావడంతో దేవెగౌడ బలపరీక్షను ఎదుర్కొని ఓడిపోయారు. ఆయన స్థానంలో ఐకే గుజ్రాల్ ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో 1997 నవంబరులో ఐకే గుజ్రాల్ కూడా రాజీనామా చేశారు. ఆ సమయంలో యునైటెడ్ ఫ్రంట్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కన్వీనర్‌గా వ్యవహరించారు.


రాష్ట్రాన్ని ఎవరికి అప్పగిస్తారు?

యువరాజు కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారనే ప్రచారం రాష్ట్రంలో ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే దీన్ని చాలాసార్లు కేసీఆర్ ఖండించారు. పదేళ్ల వరకు తానే సీఎం అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు స్పష్టం చేసినందున రాష్ట్రాన్ని కేటీఆర్ కు అప్పగించే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు రెండేళ్ల సమయముంది. షెడ్యూల్ ప్రకారమైతే 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే అప్పటి దాకా నిలదొక్కుకొని ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు. అప్పటి వరకు ప్రాంతీయ పార్టీల అధినేతలతో కలిసి థర్డ్ ఫ్రంట్ బలోపేతం పై దృష్టి పెట్టొచ్చని ఆయన ఆలోచిస్తున్నట్టున్నారు. అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి చేస్తే టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా.. ప్రతిపక్షాలు బలపడతాయా... మరోసారి అధికారంలోకి రాగలగుతామా.. లేకపోతే ముందస్తుకు వెళ్తే లాభమా ఇలా అన్ని విధాలా ఆలోచిస్తూ, సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 



2019లో కూడా.. 

2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను తెరపైకి తీసుకువచ్చారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఇలా ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు. ఎన్నికల తరువాత మౌనం వహించారు. అయితే ఇప్పుడు కాస్త సీరియస్ గా నే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే స్టాలిన్, తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వంటి నేతలను కలిశారు. యూపీలో అఖిలేశ్ యాదవ్ కు మద్దతు పలికారు. అయితే టీఆర్ఎస్ అధినేత నిర్ణయం సరైనదేనా?  వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు కలిసొస్తాయా అంటే వేచి చూడాల్సిందే.

Comments