ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9640466464
ముస్లిం అమ్మాయిలు.. ఇప్పుడిప్పుడే విద్య ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నారు. పెద్దలు ఒప్పించో.. ఎదిరించో ఇంటి గుమ్మాన్ని దాటుతున్నారు.. ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యోగాలు చేయాలని, అభివృద్ధి వైపు పయనించాలని కలలు కంటున్నారు. అయితే ముస్లిం అమ్మాయిల అభివృద్ధిని చూడలేని కొన్ని శక్తులు వారిని వివాదాల్లోకి లాగుతున్నాయి. వస్త్రధారణ పేరిట చదువుకు దూరం చేసే కుట్రను పన్నుతున్నాయి. ఇటీవల కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపుర పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను లోనికి అనుమతించకుండా ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో విద్యార్థినులకు, ప్రిన్సిపల్, ఇతర అధ్యాపకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తే అనుమతించే ప్రసక్తే లేదని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. ప్రవేశాల సమయంలో ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా ఇప్పుడు చెబితే ఎలా? అని విద్యార్థినులు ప్రశ్నించారు. వార్షిక పరీక్షలు మరో రెండు నెలల్లో ఉండగా, ఇప్పుడిలా ఆంక్షలు పెడితే ఎలాగని విమర్శించారు. విద్యార్థినులను కళాశాల మైదానం వెలుపలే కొద్దిసేపు గడిపి వెనుదిరిగారు. ఇది ఈ రోజు ఒక కళాశాలకే.. ఒక రాష్ట్రానికే పరిమితమై ఉండొచ్చు.. రేపు అన్ని రాష్ట్రాలకు, దేశానికంతటికి పాకితే ముస్లింల అమ్మాయిల చదువుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
addComments
Post a Comment