అల్లుడిని పక్కన పెట్టే ప్రయత్నమా..
కొడుకు కోసం తాపత్రయమా..!
హరీష్ రావు ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం
ఇదే కార్యకర్తల చర్చల సారాంశం
ఫిరోజ్ ఖాన్, రాజకీయ విశ్లేషకులు, 9640466464
దుబ్బాకలో కమలం వికసించింది.. కాషాయ జెండా ఎగిరింది. అయితే ఇది బీజేపీ విజయమా.. టీఆర్ఎస్ స్వయం కృతాపరాధమా.. అనే చర్చ ఓ వైపు జరుగుతుండగా.. అంతర్గత ప్రణాళికలు.. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా టీఆర్ఎస్ కావాలనే ఈ ఎన్నికపై ఎక్కువ దృష్టి పెట్టలేదనే వాదనా వినిపిస్తోంది. టీఆర్ఎస్ కు చెందిన కీలక నాయకుడు హరీష్ రావును పక్కన పెట్టి.. కొడుకు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించేందుకు సీఎం కేసీఆర్ ఇలాంటి ప్రణాళికలు రచించారనే ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక నియోజకవర్గం.. మంత్రి హరీశ్ రావు సొంత జిల్లా అయిన సిద్ధిపేట పరిధిలో వస్తుంది. గత 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే కొంత కాలం క్రితం ఆయన మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితం నవంబర్ పదో తేదీన రాగా.. హోరా హోరీ జరిగిన పోరులో ఇక్కడి నుంచి బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ కు అయితే డిపాజిట్ కూడా దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండగా.. రఘునందన్ రావు గెలుపుతో ఆ సంఖ్య రెట్టింపు అయింది. అయితే ఏ విధంగా చూసినా ఇది టీఆర్ఎస్ ఓడిపోయే స్థానం కాదు. బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోదని ప్రగల్భాలు పలికిన నాయకులు ఆ పార్టీ గెలుపుతో నోరు మూసుకున్నారు.. అయితే ఇలా ఎలా జరిగిందనే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల్లో జరుగుతోంది. దీనికి అనేక మంది నాయకులు అనేక కారణాలు చూపుతుండగా.. సీఎం కేసీఆర్ గురించి తెలిసిన నాయకులు మాత్రం ఈ స్థానాన్ని కావాలనే ఓడిపోయారని చెబుతున్నారు. మంత్రి హరీశ్ రావును పక్కన పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఇలా చేశారని పేర్కొంటున్నారు.
addComments
Post a Comment